కడప ‘స్మార్ట్ కిచెన్’ దేశానికే ఆదర్శం.. సీఎం చంద్రబాబు ప్రశంసలు

  • కలెక్టర్ల సదస్సులో వినూత్న ప్రాజెక్టులపై ప్రజెంటేషన్లు
  • నెల్లూరు ‘ఛాంపియన్ రైతు’ విధానాన్ని ప్రశంసించిన సీఎం చంద్ర‌బాబు
  • భూరికార్డుల డిజిటలైజేషన్‌లో అనంతపురం కలెక్టర్ కొత్త ప్రయోగం
  • ఈ విధానాలు రాష్ట్రమంతటా అమలు చేయాలని ముఖ్య‌మంత్రి సూచన
జిల్లా కలెక్టర్ల సదస్సులో భాగంగా పలు జిల్లాల కలెక్టర్లు తమ ప్రాంతాల్లో చేపట్టిన వినూత్న కార్యక్రమాలను సీఎం చంద్ర‌బాబుకు వివరించారు. నెల్లూరు, కడప, అనంతపురం జిల్లాల కలెక్టర్లు సమర్పించిన ప్రజెంటేషన్లపై సీఎం ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ తరహా ఉత్తమ విధానాలను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని సూచించారు.

నెల్లూరు ‘ఛాంపియన్ రైతు’ అద్భుతం
నెల్లూరు జిల్లాలో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు ‘ఛాంపియన్ రైతు’ అనే కార్యక్రమం చేపట్టామని కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. ప్రతి గ్రామంలో ఒక ఛాంపియన్ రైతును ఎంపిక చేసి, వారి ద్వారా యాంత్రీకరణ, ఎరువులు-పురుగుమందుల వాడకం తగ్గింపు, ప్రత్యామ్నాయ పంటలు, ప్రకృతి సేద్యం వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంపై సీఎం స్పందిస్తూ, "ఈ ఇనిషియేటివ్ చాలా బాగుంది. అన్ని శాఖలను సమన్వయం చేసి రైతులకు మేలు చేసేలా కలెక్టర్ హిమాన్షు శుక్లా చక్కగా పనిచేస్తున్నారు" అని ప్రశంసించారు. ఛాంపియన్ రైతులను స్వయం సహాయక సంఘాలుగా లేదా ఎంఎస్ఎంఈలుగా తీర్చిదిద్దాలని సూచించారు.

దేశానికే ఆదర్శం కడప ‘స్మార్ట్ కిచెన్’
కడప జిల్లాలో పాఠశాల విద్యార్థులకు వేడిగా, రుచిగా పౌష్టికాహారం అందించేందుకు ‘స్మార్ట్ కిచెన్ ఫర్ ఆల్ ద స్కూల్స్’ ప్రాజెక్టు చేపట్టామని కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ తెలిపారు. ప్రతి మండలానికి ఒక స్మార్ట్ కిచెన్ ఏర్పాటు చేసి, పాఠశాలలకు భోజనం అందిస్తున్నామని చెప్పారు. దీని కోసం సౌర విద్యుత్, బయో గ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేశామన్నారు. ఈ ప్రాజెక్టును ప్రశంసించిన సీఎం, ఇది దేశానికే మోడల్‌గా నిలుస్తుందన్నారు. "స్మార్ట్ కిచెన్... స్మార్ట్ హెల్త్... స్మార్ట్ చిల్డ్రన్ అనేలా దీన్ని తీర్చిదిద్దాలి. అన్ని జిల్లాల కలెక్టర్లు కడప స్మార్ట్ కిచెన్లను సందర్శించాలి" అని ఆదేశించారు. మంత్రి లోకేశ్‌ మాట్లాడుతూ.. ఈ విధానాన్ని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు వివరించగా ఆయన కూడా అభినందించారని తెలిపారు.

భూ రికార్డుల డిజిటలైజేషన్‌లో కొత్త శకం
అనంతపురం జిల్లాలో రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్‌లో ఏఐ (కృత్రిమ మేధ)ను వినియోగిస్తున్నామని కలెక్టర్ ఆనంద్ వివరించారు. రికార్డుల తారుమారుకు అవకాశం లేకుండా ఒక ఆన్‌లైన్ లైబ్రరీని సిద్ధం చేశామన్నారు. దీనిపై సీఎం హర్షం వ్యక్తం చేస్తూ, అన్ని భూ రికార్డులను క్లౌడ్‌లో భద్రపరచాలని, దీనివల్ల మానిప్యులేషన్‌కు ఆస్కారం ఉండదని అన్నారు. ఈ మూడు ప్రాజెక్టులు జిల్లాల్లో ‘గేమ్ ఛేంజర్లు’గా మారతాయని, క్షేత్రస్థాయి నుంచి ఇలాంటి ఆవిష్కరణలు రావాలని ఆకాంక్షించారు.

Chandrababu
Kadapa Smart Kitchen
Andhra Pradesh
Smart Kitchens
Collector Sridhar
Nellore Champion Farmer
Anantapur Land Records
Digitalization
School Nutrition
Collector Anand

More Telugu News